Telangana Resists Alternative Voice
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Telangana Resists Alternative Voice, Social service, gun park, Hyderabad.
16/05/2025
షేర్ చేయకండి రీపోస్ట్ చేయండి. షేర్ చేస్తే రీచ్ ఉండదు.
డాక్టర్ రవి... కామ్రేడ్ రవి... కర్రెగుట్టల్లో నేలకొరిగిన మనిషి...
ఈ ఫొటో చూడగానే ఒక్కసారి డాక్టర్ ఎర్నెస్టో గువేరా గుర్తొచ్చాడు. మొన్నటికి మొన్న బార్డర్లో ప్రాణాలు కోల్పోయిన మురళీ నాయక్ కూడా కళ్లముందు మెదిలాడు. ఉద్యమంలోకి వాళ్ల పాటలు విని పోయారు, వీళ్ల మాటలు విని ఉద్యమం లోకి పోయారు అని సొల్లు వాగే మనుషులూ గుర్తొచ్చారు.
ఎవడూ ఊరికే ఆయుధాన్ని చేతిలోకి తీసుకోడు. ఎవడూ ప్రాణాలు పోయే రిస్క్ లోకి టైమ్పాస్ కోసం దిగడు. ఒక సైనికుడు తన కుటుంబం కోసం, లోపల ఉన్న దేశభక్తితో సైన్యంలో చేరతాడు. మరో మనిషి దేశం మీద ప్రేమతోనే వచ్చే మార్పులో తనకుటుంబం కూడా ఉంటుందన్న కలతో సైనికుడిగా మారతాడు.
ఈ ఇద్దరూ "నేను మరణించాక నన్ను హీరోగా చూస్తారు, నాకు నివాళులు చెప్తారు" అని ఆశించకుండా తమ తమ సొంత జీవితాలకోసమో, ఆశయాలకోసమో ఆ పంథాని ఎంచుకుంటారు.
ఒక డాక్టర్ ఇలా ఎందుకు మరణించాల్సి వచ్చింది? వ్యవస్థలో మార్పు అంటూ ఇంట్లో కూర్చునో, ఏ రోడ్డు మీది ధర్నాలోనో కాసేపు కూర్చుని నామినల్ అరెస్ట్ అయి ఇంటికి రావచ్చుకదా? నాలుగు నినాదాలు ఇచ్చి, కాస్త ఎర్ర కవిత్వం రాసి విప్లవకారుడిగా ఫోజు కొట్టొచ్చు కదా...
కలలు కనలేని వాళ్లు, ప్రజల్ని ఆ కలల్లో ముంచెత్తని వాళ్ళు విప్లవకారులు కాలేరు అనే చారు మజుందార్ మాటలని ఒకసారి గుర్తు చేసుకుంటే. ఈ మరణాలకు వేరు వేరు కారణాలు మనకు కనిపించవచ్చు.
దేశాల రాజకీయ ఆటల్లో, దేశమే తన ప్రజలతో ఆడుకునే మృత్యు క్రీడల్లో బలైపోయిన, అవుతున్న వాళ్లే వీళ్లంతా. పోలీస్, సీఆర్పీఎఫ్, బీఎసెఫ్, మావోఇస్ట్ పేరేదైనా కావచ్చు. యుద్దమంటూ జరుగుతున్నప్పుడు ఇరుపక్కలా మనుషులు మరణిస్తారు.
కానీ ఇప్పుడు దేశం లోపలే జరుగుతున్నది యుద్దం కాదు... ఏకపక్ష దాడి. చర్చల కోసం ప్రతిపాదనలు చేస్తున్నా పట్టించుకోకుండా చంపుతున్నవాళ్లలో మావోయిస్టులు ఎందరు? అమాయక ఆదివాసులు ఎందరు అన్న విషయం బయటికి తెలిసే వీలే లేదు. వందల కొద్దీ ఊళ్లలో కనీస వ్యవసాయ పనులు కూడా చేసుకునే వీలు లేక బిక్కుబిక్కుమంటున్న అడవి బిడ్డల చావు కేకలు వినిపించటం లేదు.
మావోయిస్టుల సాయుధ పోరాటాన్ని వ్యతిరేకించే వాళ్లకైనా అడవిలో ఉన్న ఆదివాసుల రక్షణ విషయం గుర్తు రావటం లేదా? ఆపరేషన్ కగార్ ఆపి చర్చలకు ఆహ్వానిస్తే లొంగిపోయేవాళ్లు వచ్చేస్తారు కదా. ఎన్నో లక్షల మంది గిరిజనులుకూడా అక్కడ ఉన్నారు వాళ్లని కాపాడిన వాళ్లవుతారు కదా అనే మాట గుర్తు రాకపోవటమే విషాదం.
రేపు అక్కడ అడవుల నిర్మూలనా, మైనింగ్ మొదలైతే వాళ్ల గతి ఏమవుతుందన్న చిన్న ఆలోచన కూడా రావటం లేదా వీళ్లకి? ఆ ఖనిజాలని విదేశాలకు అమ్ముకోవటం తప్ప మనదేశానికి పనికి వచ్చే పరిశ్రమలు లేనే లేవు కదా. నా దేశానికి పనికి రాని మైనింగ్ ఎందుకు? అనే దేశ భక్తి కూడా కరవైందా?
రోజురోజుకీ మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. పేరు తెల్సిన ఒకరిద్దరు వీరుల కోసం సంస్మరణ సభలో, నివాళ్లులో చెబుతున్నాం గానీ అసలు పేరే తెలియకుండా చనిపోతున్నవాళ్లలో నిజమైన తిరుగుబాటుదారులు ఎంతమంది? అసలు తమ మీద మోపబడ్డ కేస్ ఏమిటో కూడా తెలియకుండా ఏళ్లకేళ్లుగా రాజకీయ ఖైదీలుగా జైళ్లలో మగ్గిపోతున్న వందలమంది ఆదివాసుల రోదన ఏమవుతోంది?
ఎవరు ఎవరి మీద చేస్తున్న యుద్దం ఇది? మరణాలు ఊరికే ఉండవు, అభివృద్ది పేరిట జరిగే వినాశనానికి ప్రతి ఫలం చెల్లించకా తప్పదు. ఆనాటికి మీరుందక పోవచ్చు కానీ మీ తరువాతి తరాలు మాత్రం మీ మౌనానికి బలైపోతారని గుర్తుంచుకోండి....
ఇప్పుడు ఆపరేషన్ కగార్ మీద విప్లవ సానుభూతిపరులూ, విప్లవ వ్యతిరేకులూ పాటిస్తున్న మౌనం కచ్చితంగా ఒక యుద్దనేరం... పుట్టిన భూమికి చేస్తున్న ద్రోహమని గుర్తుంచుకోండి....
NOTE: షేర్ చేయకండి రీపోస్ట్ చేయండి. షేర్ చేస్తే రీచ్ ఉండదు.
ఔరంగజేబు చక్రవర్తిని ఎదురించింది ఒక్క మరాఠా వీరులు మాత్రమే అన్నట్టు ఇవాళ సోషల్ మీడియా ఊగిపోతుంది. ఐరనీ ఏంటంటే తెలంగాణ వాళ్లు కూడా దాన్నే నిజం అనుకుంటున్నరు.
మహాత్మా పూలే కంటే ముందే గోల్కొండ గడ్డపై సామాజిక న్యాయాన్ని అమలుచేసిన బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ది కూడా వీరోచిత చరిత్ర అన్న సంగతి చాలా మందికి తెలియదు. శివాజీ, సంభాజీ లెక్కనే మొఘల్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడి అమరుడైన పాపన్న గౌడ్, వరంగల్ జిల్లా ఖిలాష పూర్ లో 1650 అగష్టు 18న పుట్టిండు.
జమీన్ దార్లు,జాగీర్ దార్ల అరాచకాలకు వ్యతిరేకంగా మొదలైన పాపన్న గౌడ్ తిరుగుబాటు గొల్లకొండ కోటను గెలిచేదాకా ఆగలేదు. చాకలి సర్వన్న, మంగలి మాసన్న, కుమ్మరి గోవిందు, జక్కుల పెరుమాండ్లు, దూదేకుల పీర్ మహ్మద్, కొత్వాల్ మీర్ సాహెబ్ వంటి బహుజన వీరులతో గెరిల్లా సైన్యాన్ని తయారుచేసిన పాపన్న, అగ్రకుల భూస్వాములు, వ్యాపారుల గడీలపై, కోటలపై దాడి చేసి సంపదను బహుజన పేదలకు పంచిండు. గడీల్లో బందీలుగా మగ్గుతున్న అణగారిన కులాల ప్రజలను విడిపించిండు. వరంగల్ జిల్లా ఖిలాషాపూర్ లో పటిష్టమైన కోటను కట్టించిండు.
పన్నెండు మందితో ప్రారంభమైన పాపన్న గౌడ్ సైన్యం పన్నెండు వేలు అయింది. చిన్న చిన్న సంస్థాలను గెలిచి రాజ్యాన్ని విస్తరించిండు. మర ఫిరంగుల నుంచి అశ్వబలం వరకు ఒక రాజ్యానికి ఉండవలసిన అన్ని రకాల సైనిక సంపత్తిని సమకూర్చుకున్నడు. మొఘల్ సామ్రాజ్యానికి కీలకమైన దక్కన్ ప్రాంతంలో పాపన్న గౌడ్ చేస్తున్న తిరుగుబాటు నాటి చక్రవర్తి ఔరంగజేబును చికాకు పరిచింది. అందుకే తన సేనాని రుస్తుంఖాన్ ను 1706 లో పాపన్న మీదకు పంపిండు. గెరిల్లా యుద్ధ తంత్రంలో ఆరితేరిన గౌడ్ సాబ్ సైన్యం ముందు మొఘల్ ఆర్మీ నిలవలేకపోయింది.
1707 లో ఔరంగజేబు చనిపోయినంక మొఘల్ సింహాసనాన్ని బహదూర్ షా అధిష్టించిండు.అతని తమ్ముడైన బీజాపూర్ సుల్తాన్ మహ్మద్ కామ్ బక్ష్ కు ఇది నచ్చలేదు. ఇంకేముంది తిరుగుబాటు. మచీపట్నంలో ఉన్న డచ్,ఇంగ్లీష్ వ్యాపారుల నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు కొన్న పాపన్న, కుటుంబ గొడవల్లో మొఘలులు ఉండగానే వేలాది సైన్యంతో వరంగల్ కోటను స్వాధీనం చేసుకున్నడు.తరువాత భువనగిరి ఖిల్లాపై బహుజన జెండాను ఎగురవేసిండు.
పాపన్న పోరాటం గురించి తెలుసుకున్న బహదూర్ షా, అతనికి స్నేహ హస్తం అందించిండు.అధికారిక గుర్తింపు కోసం కప్పం చెల్లించి రాజ్యపాలన చేసుకోవచ్చన్న షా ఆఫర్ ను పాపన్న తెలివిగా ఉపయోగించుకున్నడు. 14 లక్షల రూపాయలతో పాటు మొఘల్ సైనికులకు భారీగా ఆహారధాన్యాలు ఇతర నిత్యావసర వస్తువులు ఇచ్చి ప్రతిఫలంగా గోల్కొండ కోటకు రాజు చేయాలని షరతు విధించిండు. అనుకున్నది సాధించి గోల్కొండ కోటకు రాజైండు పాపన్న గౌడ్.
పరాక్రమంలోనే కాదు రాజనీతిలో కూడా పాపన్న ఏ చక్రవర్తికి తీసిపోడు స్వయం సమృద్ధి కోసం ఎన్నో సంస్కరణలు అమలుచేసిండు. కులవృత్తులను ప్రోత్సహించిండు. వేలాది ఎకరాల్లో తాటి,ఈత,జీలుగు చెట్లను నాటించిండు. అయితే ఒక కల్లుగీసేవాడు గోల్కొండ కు రాజు కావడాన్ని కొన్ని కులాలు జీర్ణించుకోలేకపోయాయి.బహదూర్ షాకు లేనిపోని మాటలు చెప్పి పాపన్నపై యుద్ధానికి రెచ్చగొట్టినయి.1709 లో తాడికొండలో మొఘల్ సైన్యంతో కొన్ని నెలల పాటు జరిగిన యుద్ధంలో పాపన్న ఓడిపోయిండు. హుస్నాబాద్ లో అజ్ఞాతంలో ఉన్న పాపన్న గౌడ్ ఆచూకీని ఒక ద్రోహి ద్వారా తెలుసుకున్న మొఘల్ సైనికులు సర్దార్ తలను నరికి బహదూర్ షాకు బహుమానంగా పంపిన్రు. మొండాన్ని గోల్కొండ కోట గుమ్మానికి వేలాడదీసిన్రు.
స్వయంపాలన కోసం ఉద్యమించిన వీరుడిగా చరిత్రలో నిలిచిన పాపన్నకు రావలసినంత గుర్తింపు రాలేదు. అదే కాలంలో మొఘల్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన శివాజీకి మన పాపన్న ఏ మాత్రం తక్కువ కాదు. కాని ఏం జరిగింది. శివాజీని కులాలకు అతీతంగా ఓన్ చేసుకుంటున్నవాళ్లు, పాపన్న గౌడ్ ను మాత్రం ఒక్క కులానికే పరిమితం చేసిన్రు. దోపిడి దొంగగా చిత్రీకరించిన్రు.
మనం పట్టించుకోకున్నా, గుర్తించి గౌరవించకున్నా ప్రపంచ ప్రసిద్ధి గాంచిన లండన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పాపన్న గౌడ్ చరిత్రపై అధ్యయనం చేసి, "ది న్యూ కేంబ్రిడ్జ్ హిస్టరీ ఆఫ్ ఇండియా", "ది సోషల్ హిస్టరీ ఆఫ్ ది డెక్కన్" వంటి పుస్తకాలలో ఆయన ఫోటోతో సహా వివరాలను ప్రచురించింది.
Click here to claim your Sponsored Listing.
Location
Category
Website
Address
Gun Park
Hyderabad

14/08/2025