Tulla Devender Goud

Tulla Devender Goud

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Tulla Devender Goud, Hyderabad.

23/04/2024

సీఎం రేవంత్‌ రెడ్డి గారి ఔన్నత్యానికి హేట్సాఫ్‌

- తూళ్ల విజయేందర్‌ గౌడ్‌

మంచిని మంచిగా చెప్పడం, మంచి చేసిన మహానుభావులను తలుచుకొని వారుచేసిన మంచిని గుర్తు చేయడం సామాన్యమైన విషయం కాదు. అలా చెప్పడానికి సంస్కారం కావాలి. అందులోనూ సొంత పార్టీ కాని వారు చేసిన గొప్ప పనుల్ని ప్రస్తుతించాలంటే గుండెల నిండుగా ధైర్యం, ఔన్నత్యం ఉండాలి. ఔదార్యం కావాలి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్‌ రెడ్డి గారికి ఇన్ని లక్షణాలు ఉన్నాయి కనుకనే ఆయనొక ప్రత్యేకమైన నాయకుడుగా ప్రజల ఆదరాభిమానాల్ని, ప్రేమను పొందగలుగుతున్నారు. దీనిని ప్రతి యువనేత నేర్చుకోవాలి, అనుసరించాలి. ఇక అసలు విషయంలోకి వెళితే..

మల్కాజ్‌గిరి కాంగ్రెస్‌ లోక్‌సభ అభ్యర్ధి శ్రీమతి సునీతా మహేందర్‌ రెడ్డి తరఫున ప్రచారం చేస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్‌ రెడ్డి గారు మాట్లాడుతూ *‘‘ఈయాళ నేనొక విషయం చెప్పదల్చుకొన్నా, ఆనాడు పెద్దలు దేవేందర్‌ గౌడ్‌ గారు ఉన్నప్పుడే వేలాది ఇండ్ల పట్టాలిచ్చి మీ బస్తీలలో, మీ మారుమూల ప్రాంతాలలో సిసిరోడ్లు వేయించి పెద్దలు దేవేందర్‌ గౌడ్‌ గారు అభివృద్ధి చేశారు. ఆయన చేసిన అభివృద్ధే ఇప్పటికీ జిల్లాల నుంచి వచ్చిన పేదోళ్లకు బస్తీలల్ల ఇళ్ల పట్లాలొచ్చినయ్‌. మరి గత పదేళ్లల్లో బీఆర్‌ఎస్‌ ఇచ్చిన ఇళ్ల పట్టాలేమిటో, చేసిన అభివృద్ధి ఏమిటో ఒక్కసారి అంచనా వేసుకోండి’’* అంటూ శ్రీ దేవేందర్‌ గౌడ్‌ గారు మంత్రిగా ఉన్నప్పుడు జిల్లాల నుంచి వచ్చి బస్తీల్లో ఉన్న వేలాది మందికి ఇళ్ల పట్టాలిచ్చిన విషయాన్ని శ్రీ రేవంత్‌ రెడ్డి గారు తన ప్రసంగంలో ప్రస్తావించారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నడూ తమకంటే ముందున్న పాలకులు చేసిన మంచి పనుల్ని కనీసం ప్రస్తావించిన సందర్భం లేదు.

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్‌ రెడ్డి గారు ఇప్పుడే కాదు.. గత అసెంబ్లీ సమావేశాలలో సైతం మాట్లాడుతూ *‘‘శ్రీ దేవేందర్‌ గౌడ్‌ గారు 2008లో ఆదిలాబాద్‌ నుంచి చేవెళ్ల వరకు పాదయాత్ర చేసి తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలంటూ ప్రాణహిత-చేవెళ్ల నిర్మించాలని చెప్పి పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఆనాటి ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజల ఆలోచనలను దృష్టిలో పెట్టుకొని ఆరోజు ప్రారంభించడం జరిగింది’’* అంటూ తెలంగాణ చరిత్రలో ఓ కీలక అధ్యాయమైన శ్రీ దేవేందర్‌ గౌడ్‌ గారు చేసిన గోదావరి జలసాధన యాత్రను ప్రస్తావించి.. చరిత్రను గుర్తు చేశారు.


గత 10 ఏళ్లల్లో చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలు అనేకం జరిగాయి. తెలంగాణ కోసం త్యాగాలు చేసిన వారిని, తెలంగాణ అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేసిన వారిని మరుగున పరిచే సంకుచితమైన ఆలోచనలు, పనులు జరిగాయి.

కానీ.. నేడు శ్రీ రేవంత్‌ రెడ్డి గారు.. గతంలో ఏం జరిగిందో నిజాలు చెబుతున్నారు. పార్టీలకతీతంగా ఆలోచిస్తున్నారు. మాట్లాడుతున్నారు.

హేట్సాఫ్‌ సీఎం రేవంత్‌ రెడ్డి గారు!
థ్యాంక్యూ..

02/06/2023

బహుజనులకు సాధికారత అందించే
ప్రజా తెలంగాణ
మన లక్ష్యం కావాలి

- తూళ్ల దేవేందర్‌ గౌడ్‌

జూన్‌ 2 ‘తెలంగాణ’ రాష్ట్రం ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సోదర సోదరీమణులకు, ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు. తెలంగాణ ఏర్పడి 9 ఏండ్లు పూర్తయ్యాయి. 10వ సంవత్సరంలో అడుగుపెడుతున్న ఈ సందర్భంలో తెలంగాణ సాకారం కావడంలో భాగస్వాములు అయినవారికి, త్యాగాలు, ఆత్మబలిదానాలు చేసిన వీరులకు వందనం.

ప్రపంచ చరిత్రలోనే తెలంగాణ ఉద్యమానికి ఎనలేని ప్రాముఖ్యం ఉంది. తెలంగాణ అస్థిత్వ పోరాటంలో జెండాలు, అజెండాలు పక్కనపెట్టి అందరూ పాలు పంచుకొన్నారు. పోరాటాలు, త్యాగాలు చేసి లక్ష్యాన్ని సాధించారు. ‘తెలంగాణ’ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు కావడంలో, తెలంగాణ హక్కుల పరిరక్షణలో నావంతు కృషి చేసింనందుకు నాకు సంతోషంగా ఉంటుంది.

అయితే, ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణను సాధించడం అన్నది ఓ మజిలీయే. తెలంగాణలో దశాబ్ధాలపాటు అణచివేతకు గురైన సబ్బండ వర్గాలు, బహుజనులకు మేలు జరిగినపుడే.. వారు సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా సాధికాతర పొందినపుడే.. అధికారంలోకి రాగలిగినపుడే ‘ప్రజా తెలంగాణ’ అవతరిస్తుంది. ఆ లక్ష్య సాధన కోసం అందరూ పునరంకితం కావాలని కోరుకుంటున్నాను.

Photos from Tulla Devender Goud's post 28/05/2023

నిబద్ధత గల గొప్ప సంస్కర్త

టి. దేవేందర్‌ గౌడ్‌
మాజీ ఎంపీ

రాజకీయాలతో అంతవరకు ఎటువంటి సంబంధం లేకున్నా.. పార్టీ ఏర్పాటు చేసిన తొలి రోజు నుండి ‘సమాజాన్ని మార్చాలి.. ప్రజలకు మేలు చేయాలి’ అని తపన పడి అధికారంలోకి వచ్చాక అందుకు అనుగుణమైన గొప్ప నిర్ణయాలు తీసుకొన్న నిబద్ధత గలిగిన మహామనిషి శ్రీ ఎన్టీ రామారావు. నిజానికి, ఆయన తీసుకొన్న నిర్ణయాలు చూస్తే ఆయననొక సంఘసంస్కర్తగా పేర్కొనాలి. రాజకీయాల మాయామర్మం తెలియని రాజనీతిజ్ఞుడాయన.

తెలుగుదేశం పార్టీలో నన్ను తొలుత బాగా ప్రోత్సహించిన వారు శ్రీ ఎన్టీ రామారావు కాగా, ఆ తర్వాత శ్రీ చంద్రబాబునాయుడు. 1988లో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతిలో జరిగినపుడు ఎన్టీఆర్‌ నాకు రంగారెడ్డి జిల్లా చైర్మన్‌గా పోటీ చేసేందుకు అవకాశం కల్పించారు. నా గెలుపు కోసం తన చైతన్యరథంపై నన్ను ఎక్కించుకొని జిల్లావ్యాప్తంగా 3 రోజులపాటు ప్రచారం చేశారు. నేను పెద్ద మెజారిటీతో గెలుపొందినపుడు ఆనందంతో పొంగిపోయారు. ఆ రోజులలో నేను ఎక్కువుగా ప్రజాసంబంధాలు పెట్టుకొనేవాణ్ణి. నా దృష్టికొచ్చిన కొన్ని జటిల సమస్యలను శ్రీ ఎన్టీ రామారావు గారి దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరిస్తే ప్రజలకు కలిగే ప్రయోజనం గురించి చెప్పేవాణ్ణి. చిన్నవాణ్ణనే కారణంతో ఆయన ఏనాడూ నేను చెప్పిన అంశాలను తేలిగ్గా తీసుకొనేవారు కాదు. పైగా, 1991లో నన్ను పార్టీ అత్యున్నత నిర్ణాయక కమిటీ అయిన పొలిట్‌బ్యూరోలో సభ్యునిగా తీసుకొని నాకు ఎనలేని గౌరవాన్ని, ప్రాముఖ్యతను కల్పించారు. పార్టీ తీసుకొనే అనేక నిర్ణయాలలో నా సలహా సూచనలు ఉండేవి. 1994 ఎన్నికలు జరగడానికి 6 నెలల ముందే నన్ను మేడ్చల్‌ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. ఆ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం సృష్టించింది. ఎన్టీఆర్‌ తన తొలి క్యాబినెట్‌లో నాకు స్థానం కల్పించి.. 3 కీలక శాఖలు అప్పజెప్పారు. మంత్రిగా ప్రమాణం చేసేవరకు నాకు 2 శాఖలు ఇండిపెండెంట్‌ చార్జితో ఇస్తున్నట్లు ప్రకటించి, ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన తనకెంతో ఇష్టమైన మద్యపాన నిషేధం శాఖను కూడా నాకు కేటాయించారు.

నేను తొలిసారి ఎమ్మెల్యే. యావత్‌ రాష్ట్రం ఆసక్తిగా గమనిస్తున్న మద్యనిషేధం బాధ్యతను నా భుజస్కంధాలపై పెట్టినందున నాకు మొదట్లో కొంచెం జంకు కలిగింది. అయితే, నా మనస్సును చదివినట్లుగా ఆయన నాతో ‘ఈ శాఖను నిర్వహించడానికి ఇపుడు సమర్ధుడు, నిజాయితీపరుడైన వ్యక్తి కావాలి.. అందుకు మీరే సరైన వారు బ్రదర్‌’ అంటూ ఎంతో అభిమానంగా ఆయన నా భుజం తట్టడంతో నాకు కొండంత ధైర్యం కలిగింది. శ్రీ ఎన్టీ రామారావు గారి ఆలోచనలకు అనుగుణంగానే వారి మార్గదర్శనంలో ఎంతో నిబద్ధతతో నాకప్పగించిన 3 శాఖలను నిర్వహించాను. నాకు కేటాయించిన సహకార శాఖలో ఆనాడు చోటుచేసుకొన్న కొన్ని అపసవ్య పద్ధతులను సరిచేసేందుకు ‘మ్యూచువల్లీ ఎయిడెడ్‌ యాక్ట్‌’ ను తయారుచేసి ఆమోదం కోసం ఆయన వద్దకు వెళ్లినపుడు ‘‘రాజకీయ ప్రమేయం లేని సహకార చట్టం తేవడం ఎంతో ముదావహం. రైతులకు పూర్తిగా అధికారం ఇవ్వాల్సిందే’’ అంటూ సహకారరంగంలో ఓ చారిత్రాత్మక మార్పునకు ఆమోదం తెలిపారు. అంతకుముందే ఆయన ప్రవేశపెట్టిన మాండలిక వ్యవస్థ, ఏకగవాక్ష విధానం, స్థానిక సంస్థలలో బీసీలకు రిజర్వేషన్లు, మహిళలకు ఆస్తి హక్కు, పటేల్‌పట్వారీ వ్యవస్థ రద్దు తదితర సంస్కరణలు ఆనాడు సమాజాన్ని అభివృద్ధి పథం వైపు వేగంగా నడిపించాయి. రాజకీయంగా, సామాజికంగా విప్లవాత్మక మార్పులకు దోహదం చేశాయి. సామాన్యులకు, యువతకు, విద్యాధికులకు రాజకీయ అవకాశాలు కల్పించిన మహానుభావుడు ఎన్టీఆర్‌.

ఇక, వ్యక్తిగతంగా మా ఇద్దరి మధ్య ఉండే అనుబంధం గురించి చెప్పాలంటే ఎన్టీఆర్‌ నాపట్ల పుత్రవాత్సల్యం చూపేవారు. 1994లో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపూర్‌లో పర్యటించేటప్పుడు నన్ను తీసుకువెళ్లేవారు. నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరు తెన్నులు, పార్టీ విషయాలపై సమాచారం సేకరించి నేను ఆయనకు వివరించేవాణ్ణి. ఓసారి మేము హిందూపూర్‌ వెళ్లినపుడు ఆ రాత్రి అక్కడే బసచేశాం. మరుసటిరోజు ఉదయం 6 గంటల సమయంలో నేను దంతధావనం ముగించుకొని ఆ రోజు దినపత్రికలు తిరగేస్తుంటే.. ‘అన్నగారు వెంటనే రమ్మంటున్నారంటూ’ నాకు కబురొచ్చింది. అప్పటికింకా నా స్నానాదికాలు పూర్తి కాలేదు. కానీ, ఏం అర్జెంటోనని ఆలోచిస్తూ ఉన్నపళంగా ఆయన వద్దకు వెళ్లాను. అప్పటికే ఆయన టేబుల్‌ మీద బ్రేక్‌ఫాస్ట్‌ సిద్ధంగా ఉంది. నన్ను చూడగానే ‘‘రండి బ్రదర్‌ కూర్చోండి’’ అని స్వహస్తాలతో ఓ ప్లేట్‌లో బ్రేక్‌ఫాస్ట్‌ వడ్డించి నాకు అందించారు తినమని. ఎన్టీఆర్‌ భోజన ప్రియులు. అలాగే.. గొప్ప అతిథేయి. ఆయన ప్రేమతో వడ్డించిన ఫలహారం ఎవరైనా పూర్తిగా తినాల్సిందే. ఆహార పదార్ధాలను వేస్ట్‌ చేయడం ఆయనకు ఇష్టం ఉండేదికాదు.

ఎన్టీఆర్‌తో నాకు మరచిపోలేని అనేక మధురానుభూతులన్నీ రాయాలంటే అవన్నీ ఓ పుస్తకం అవుతుంది. అనురాగం, ఆప్యాయత, ప్రేమలకు ప్రతిరూపం ఆయన. ఎన్టీఆర్‌ వచ్చాకనే రాజకీయాలకు విలువ పెరిగింది, గౌరవం లభించింది. ఆయన తన జీవితంలోని విలువైన అనుభవాలను రంగరించి వాటిని ప్రజా జీవితంలో అమలు చేసి బడుగు బలహీన వర్గాలకు ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచారు. ఆ మహానుభావుడి దివ్య స్మృతికి నా నివాళి.

21/03/2023
21/03/2023

70th Birthday Celebrations at Thukkuguda home.

Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Culinary Team

Attire

Telephone

Address


Hyderabad